-పెంచిన ఫీజులను తగ్గించాలని విద్యార్థుల డిమాండ్
-విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
-ఆందోళనకారులపై వ్యాటర్ కెనాన్లను ప్రయోగించిన పోలీసులు
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపుతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్ బయట పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. విద్యార్థినులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపారు. దీంతో పోలీసుల తీరుపైనా వారు తీవ్రంగా నిరసన తెలిపారు. దీంతో విద్యార్థుల ఆందోళనతో జేఎన్యూ ప్రాంగణం దద్ధరిల్లింది. విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. గేటువైపు దూసుకొస్తున్న కొంతమంది విద్యార్థులను పట్టుకొని పోలీసులు చితకబాదారు. ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్
కుమార్ పలుమార్లు తిరస్కరించడంతో విద్యార్థులు సోమవారం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు మార్చ్ గా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఏఐసీటీఈ కాన్వకేషన్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకడు ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులను ఏఐసీటీఈ కాన్వకేషన్ జరుగుతున్న ప్రదేశం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులుకు-విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. బ్యానర్లు చేతిలో పట్టుకుని, నినాదాలు చేస్తూ పోలీసులుగా అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆందోళనకు ముందు విద్యార్థులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు పెంపు భరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా సమానత్వం యొక్క కలను అణగదొక్కేస్తున్నారంటూ జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ఫీజు పెంపు చాలామంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. డ్రెస్ కోడ్,కర్ఫ్యూ టైమింగ్స్ వంటి ఇతర నిబంధనలు తిరోగమన పరిస్థితులను ప్రతిబింబిస్తాయని విద్యార్థి సంఘం తెలిపింది.