ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య ..
తండ్రి బాడీగార్డ్కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి రాజేష్
షాద్నగర్, ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని కేకే ఫార్మస్లో చోటు చేసుకుంది. శనివారం షాద్నగర్ ఏసిపి కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మృతుడు కమ్మరి కృష్ణ చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పలు ఆస్తులు కలిగి ఉన్నాడని, ఇందులో భాగంగా బండ్లగూడలోని కేకే కన్వెన్షన్, కమ్మదానం లోని కేకే ఫామ్ హౌస్ ఉందని, అయితే మృతుడు కృష్ణ మొదటి భార్యను, ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకుని, ఆవిడ మరణించిన తదుపరి మూడో వివాహం చేసుకున్నాడని తెలిపారు.
మూడో వివాహం చేసుకున్న పావనికి 16 నెలలు కుమార్తె జన్మించింది. మూడవ భార్య పేరిట దాదాపు 16 కోట్ల విలువచేసే పదంతస్తుల భవనం, కేకే బిల్డింగ్లను రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అయితే ఆస్తి విషయంలో మొదటి భార్య పెద్దకొడుకు శివ కృష్ణతో గొడవపడ్డాడని, తండ్రి అయిన కృష్ణను ఇలాగే వొదిలేస్తే ఆస్తి మొత్తం ఆమెకే రాసిస్తాడనే ఉద్దేశ్యంతో ఎలాగైనా కృష్ణను చంపాలని ప్లాన్ చేసి కృష్ణ వద్ద పని చేసే అంగరక్షకుడు బాబాకు 25 లక్షలు, ఒక ఇల్లు ఇస్తానని ఆశ చూపాడని, ఇందుకు అంగీకరించిన బాబా రెండు లక్షలు తీసుకుని ఈ నెల 10 వ తేదిన సాయంత్రం 5.30 గంటలకు జీలకర్ర గణేష్ ఆలియస్ లడ్డు,
ఇంకొక వ్యక్తితో కలిసి కమ్మదనం లోని కేకే ఫార్మస్కు చేరుకుని కమ్మరి కృష్ణ చేతులు వెనకకు పట్టుకోవడంతో బాబా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతి క్రూరంగా గొంతు కోసి, పొట్టలో పొడిచి చంపేశారని, ఈ హత్యపై మృతుడు కమ్మరి కృష్ణ మూడోవ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు, ఒక ద్వి చక్ర వాహనం, మూడు కత్తులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ తెలిపారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో ఏసిపి రంగస్వామి, సీఐలు విజయ్ కుమార్, రాంరెడ్డి తదితరులున్నారు.