సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలి
మంత్రి కోమటిరెడ్డి డిమాండ్
గన్పార్క్ నుంచి ఇడి ఆఫీస్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోదీ నల్లధనం తెస్తానని..పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదన్నారు. అదానీని మాత్రం మోదీ ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో చేర్చాడని మండిపడ్డారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ లేదని, అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్ ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దామని,. లేదంటే మోదీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయన్నారు. లేదంటే 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచేదన్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ లేదన్నారు. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు. తమ పోరాటం బీజేపీ తోటే అన్నారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..సెబీ చైర్మన్ని వెంటనే విధుల నుంచి తప్పించాలన్నారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. మోదీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు.