- బండి ప్రాజెక్టుల గురించి కొనా..మొదలు తెలియదు
- తెలియకుండా ఎలా మాట్లాడుతారు
- మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 22 : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆర్డీఎస్ కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్ కొన తెల్వదు..మొన తెల్వదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు అని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల గురించి తెలవకుండా మాట్లాడితే కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా సంజయ్కు లేదని ఎద్దెవా చేశారు. ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో కాగితం రాసిస్తావా? అని బండిని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏ పనులు చేపడతావ్..ఎక్కడ నుండి నిధులు తెస్తావో ప్రజలకు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలేసి, ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డీకె అరుణను పక్కన పెట్టుకుని బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. అసలు ప్రాజెక్టుల విద బండి సంజయ్కు ఉన్న అవగాహన సున్నా.. అంటూ విమర్శించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అనేకమార్లు టీఆర్ఎస్ ఆర్డీఎస్ ఆయకట్టుపై ఉద్యమించిందని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అరవై ఏండ్ల కింద పూర్తయిన ఆర్డీఎస్ను ఆరునెలలలో పూర్తి చేస్తాననడం అవివేకం.. అవగాహనా రాహిత్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎండాకాలంలో జూరాలను నింపే దమ్ము, ధైర్యం ఉందా ?
ఆర్డీఎస్ హెడ్ వర్కస్ వద్ద 87,500 ఎకరాలకు సాగునీరు తీసుకువెళ్లేలా పనులు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకురాగలిగే దమ్ముందా ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఎస్ కాలువకు సాగునీరు తీసుకువచ్చే ప్రాంతం కర్ణాటకలో ఉంది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు వాగులు, వంకలు తెలియని వాళ్లు పాలమూరు ప్రాజెక్టుల గురించి వంకలు పెట్టడం హస్యాస్పదంగా ఉందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.