ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్‌-1’ ‌మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ ‌పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని వెల్ల‌డించింది.

గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా..  వారి అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ మెయిన్స్ ‌పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది. ’గ్రూప్‌-1’ ‌ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇటీవల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించాలని కమిషన్‌కు సూచించింది.

చట్టానికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ.. వాటిని తిరస్కరిస్తు న్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే దీనిపై నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page