రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.
కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బదిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో యూపీ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా ముందుకు సాగుతున్నదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్కు ప్రధాని మోదీ సరికొత్త గుర్తింపును తీసుకువొచ్చారని ఆయన ప్రశంసించారు.