చట్టసభలో జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా

ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎంఎల్‌సి అమీర్‌ అలీ ఖాన్‌
ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవం
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్‌ అలీ

హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఓ ‌పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎఎంఎల్‌సి, సియాసత్‌ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమీర్‌ అలీ ఖాన్‌ ‌భరోసా ఇచ్చారు. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం బషీర్‌బాగ్‌లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూ), హైదరాబాద్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌జర్నలిస్టస్(‌హెచ్‌యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్‌తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్‌ అలీ ఖాన్‌, ‌తండ్రి జహేద్‌ అలీ ఖాన్‌, ‌నేడు తాను యూనియన్‌ ‌కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలు పంచుకుంటున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వొచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమీర్‌ అలీ ఖాన్‌ ‌హామీ ఇచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్‌ అలీ మాట్లాడుతూ… సియాసత్‌ ‌పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్‌ అలీ ఖాన్‌ ఉమ్మడి రాష్ట్రంలోని తమ ఏపీయూడబ్ల్యూజే సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసారు. రాష్ట్ర అక్రెడిటేషన్‌ ‌కమిటీలో తమ యూనియన్‌ ‌ప్రతినిధిగా, ప్రెస్‌ అకాడమీ పాలక మండలి నియామక విధి విధానాల కమిటీ ఛైర్మన్‌గా ఆయన కొనసాగారని విరాహత్‌ ‌గుర్తుచేసారు. ప్రస్తుతం అమీర్‌ అలీ ఖాన్‌ ఎంఎల్‌సిగా నియామకం కావడం ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవంగా తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు ఎంఏ.మాజీద్‌, ‌టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్‌, ‌తెలంగాణ చిన్న మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్‌ ‌బాబు, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్‌ ‌గౌడ్‌, ‌హమీద్‌ ‌షౌకత్‌ ‌లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page