నేరుగా ఇంటికి చేరుకున్న కవిత

తల్లిని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం
ఓదార్చిన బంధువులు.. సన్నిహితులు
అన్నకెటిఆర్‌కు రాఖీ కట్టిన కవిత
ఫామ్‌హౌజ్‌లో తండ్రి కెసిఆర్‌ను కలవనున్న కవిత

హైదరాబాద్‌,ఆగస్ట్28: ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో తీహార్‌ ‌జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌ ‌చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేరుగా  హైదరాబాద్‌లోని తన  నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు. ఇక బంధువులు, కుటుంబ సభ్యులు పూల వర్షం కురిపించి కవితకు ఘన స్వాగతం పలికారు.

ఇంట్లోకి వెళ్లిన తర్వాత నేరుగా పూజ గదికి వెళ్లి దేవుళ్లకు దండం పెట్టుకున్నారు. కవితను కలిసిన వెంటనే తల్లి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కూతురిని ఆప్యాయంగా హత్తుకున్నాక తల్లి శోభ కన్నీటి పర్యంతమయ్యారు.

 

తల్లిని పట్టుకుని కవిత కూడా ఏడ్చారు. కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఇక తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆమె రాఖీ కట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న కవితకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా.. పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్ట్ ‌దద్దరిల్లింది.

 

ఐదునెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ ‌నేతలు ఉన్నారు. కవిత ఎయిర్‌పోర్ట్ ‌నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌ ‌చేరుకొని తండ్రి,  కేసీఆర్‌ను కలుసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page