కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఫతేనగర్ లోని పండాల సతీష్ గౌడ్ తో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పాదయాత్రలో మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో నిరాజనాలు పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఒకప్పుడు ఫతేనగర్ లో మంచినీళ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, వర్షం వస్తే రోడ్లు బురదమయం అయ్యేవని అన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని 400 కోట్ల రూపాయలతో ఎస్టిపి ప్లాంట్ నిర్మాణం, గల్లీ గల్లీకి సిసి రోడ్లు, 24 గంటలు విద్యుత్ అందించి అత్యధికంగా కార్మికులు నివసించే ఫతేనగర్ లో నేడు పూర్తిస్థాయిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని అనడంలో సందేహం లేదన్నారు. 60 ఏళ్లుగా కానీ ఈ పనులు కేవలం 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో చేసి చూపించామన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ పలుకుతున్న ప్రగల్బాలు ప్రజలు నమ్మవద్దని, గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పరిశ్రమలు, రైతులు అల్లాడిపోయేవారని అన్నారు. నేడు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న దుస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవద్దని పిలుపునిచ్చారు. అభివృద్ధికే ఓటు వేయాలని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని అన్నారు.