మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకులలో జమచేసి బ్యాంకులు చెల్లించే వడ్డీపై ప్రధానంగా ఆధారపడి జీవనయాత్ర సాగిస్తున్న వరిష్ఠ పౌరులు  సీనియర్‌ సిటిజెన్స్‌..  మరింత ‘మిక్కిలి’గా దుఃఖిస్తున్నారట. అరవై ఏళ్లు పైబడిన ఇలాంటి వరిష్ఠ ‘బ్యాంకు ఖాతాదారులు’ దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా ఉన్నారట. కానీ స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్‌ డొమస్టిక్‌ ప్రాడక్ట్‌- జిడిపిని పెంచి పెంచి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడిరపచేసుకోవడం ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ వారి అతి ప్రధాన కార్యక్రమమైపోయింది. ‘వడ్డీ’ శాతం తగ్గితే ‘జిడిపి’ పెరుగుదల గతి పరుగులు తీస్తుందన్నది వ్యవస్థీకృతమైన ఆర్థిక సిద్ధాంతం.

 

అందువల్ల బ్యాంకుల నుంచి అప్పులు స్వీకరించి పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులను పెంచే లక్షల మంది సౌకర్యార్థం ‘వడ్డీలు’ తగ్గవలసిందే! బ్యాంకులలో చిన్న మొత్తాలను పెద్ద మొత్తాలను జమచేస్తున్న కోట్ల మందికి అసౌకర్యం కలిగినప్పటికీ ప్రభుత్వం చింతించవలసిన పని లేదు.  ‘రిజర్వ్‌ బ్యాంకు’వారు వాణిజ్య బ్యాంకుల నుండి వసూలుచేసే వడ్డీ శాతం తగ్గిపోతోంది. అందువల్ల వాణిజ్య బ్యాంకులు తమవద్ద ఋణాలు తీసుకొనేవారికి మరింత తక్కువ వడ్డీకి అప్పులిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తాలను ఋణాలుగా తీసుకుంటున్న వ్యాపారులు పారిశ్రామికులు ఉత్పత్తులను పెంచుతున్నారట.  ‘జిడిపి’ పెరుగుతోంది. కానీ ఇలా ‘వడ్డీ’లు తగ్గడం వల్ల నగదు చెలామణి పెరిగి, వస్తువులకు గిరాకీ పెరిగి, ధరలు .. ద్రవ్యోల్బణం కూడ భారీగా పెరగడం సమాంతర పరిణామక్రమమన్నది చరిత్ర చెబుతున్న పాఠం. దీనివల్ల కోట్ల మంది వినియోగదారులు తాము కొనుగోలుచేసే నిత్యావసరాలకు ఎక్కువ ధరలను చెల్లించవలసి వస్తుంది. ఇలా కోట్ల మంది బ్యాంకులలో జమచేసిన వారికి లభించే వడ్డీ శాతం తగ్గుతోంది. మరిన్ని కోట్ల మంది వినియోగదారులు అధికంగా ధరలను చెల్లించాలి! అయినా ఈ కోట్ల మందికి ప్రాధాన్యం లేదు. ‘ఉత్పత్తి’ని పెంచి ‘జిడిపి’ని పెంచగల లక్షల ‘‘పెట్టుబడిదారుల’’కు తక్కువ వడ్డీలకు బ్యాంకుల నుంచి ఋణాలు లభించడం ప్రధానం.

 

‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించిన మాజీ ప్రధాని, ‘అంతర్జాతీయ ఆర్థికవేత్త’ మన్‌మోహన్‌ సింగ్‌ నేర్పిన పాఠం ఇది. ‘నేర్చుకున్న’ ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో ‘అనుసరిస్తోంది..’ రెండు కోట్ల కోట్లు రూపాయల మూడు ట్రిలియన్‌ అమెరికా డాలర్ల  స్థాయి మన ‘జిడిపి’మూడున్నర కోట్లు కోట్ల రూపాయల- ఐదు ట్రిలియన్ల డాలర్లకు ఎదగడం మన స్వల్పకాలిక లక్ష్యం మరి!! కానీ వ్రతం చెడినప్పటికీ ఫలితం దక్కడం లేదన్నది మన్‌మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ధ్రువపడిన వాస్తవం. ఇప్పుడు మరోసారి ధ్రువపడుతున్న సత్యం! మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతోందని ‘అంతర్జాతీయ ఆర్థిక’ సంస్థలు నిర్ధారించడానికి ఇదంతా నేపథ్యం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన దేశపు ‘జిడిపి’ కేవలం ఆరు శాతం పెరగనుందని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’  ఇంటర్‌ నేషనల్‌ మానిటరీ ఫండ్‌  నిర్వాహకులు నిర్ధారించారట. అంతర్జాతీయ ఆర్థిక ‘మందగమన’  స్లోడౌన్‌  ప్రభావం ఇతర దేశాలలోకంటె మన దేశంలో అత్యధికంగా ప్రస్ఫుటిస్తోందన్నది ‘ద్రవ్యనిధి’ నిర్వాహకులు  కనిపెట్టిన మహావిషయం. అంటే ఏమిటి? ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ..  మార్కెట్‌ ఎకానమీ జాతీయ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానంచేయడం వంటి కార్యక్రమాల విపరీత ప్రభావం మన దేశంలో మిగిలిన దేశాలలోకంటె మరింత ఎక్కువగా ఉందన్నది జరిగిన నిర్ధారణ.

 

ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశపు ‘జిడిపి’ పెరుగుదల ఆరు శాతం మాత్రమేనని  ‘ప్రపంచ బ్యాంక్‌’ వారు కూడ సెలవిచ్చి ఉన్నారు. ‘ప్రపంచీకరణ’కు పూర్వం, ‘ప్రపంచీకరణ’, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’  డబుల్‌ యుటిఓ వ్యవస్థీకృతమైన తరువాత కూడ చాలా ఏళ్లపాటు మన ‘జిడిపి’ సాలీనా తొమ్మిది శాతం, ఎనిమిది శాతం చొప్పున పెరిగింది. 2008లో అమెరికా ఆర్థిక వాణిజ్య సంస్థలు దివాలా తీసినప్పటి నుంచి ‘అంతర్జాతీయ ఆర్థిక మందగమనం’ ఆరంభమైంది. జాతీయ ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకొనడానికై అమెరికా ప్రభుత్వం ‘ప్రపంచీకరణ వ్యవస్థ’ నుంచి నిష్క్రమించడానికి యత్నిస్తోంది.  అందువల్ల ‘ప్రపంచీకరణ’ కబంధ బంధం నుంచి, విదేశీయ సంస్థల పెట్టుబడుల వ్యామోహం నుంచి, విదేశీయ సంస్థల ‘చొరబాటు’ కార్యక్రమం నుంచి విముక్తం కావడానికి మన ప్రభుత్వం ఇప్పుడైన నడుం బిగించాలి. శత్రు దేశమైన చైనాతో ‘వాణిజ్య పారిశ్రామిక’ సంబంధాలను సర్వసమగ్రంగా తెగతెంపులు చేసుకోవడంవల్ల విదేశీయ వాణిజ్యం లోటు భారీగా తగ్గిపోతుంది. విదేశీయ వాణిజ్యంలో ఏర్పడిన లోటు ‘జిడిపి’ పెరుగుదలకు ప్రధాన ప్రతిబంధకంగా మారి ఉంది. ఇతర దేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వస్తున్న నిధులకంటె ఇబ్బడిముబ్బడిగా విదేశీయ సంస్థలు మనదేశం నుంచి లాభాల రూపంలో నిధులను తరలించుకొని పోతున్నారన్నది

‘స్వదేశీయ ఆర్థిక’ సిద్ధాంతవేత్తలు చెబుతున్నమాట! ఈ విషయమై ప్రభుత్వాలు అధ్యయనం చేయాలి! విదేశీ సంస్థలను దేశం నుంచి వెళ్లగొట్టినట్టయితే ఇలా లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతున్న నిధులను నిరోధించవచ్చు! ప్రగతి భ్రాంతిని కల్పిస్తున్న ‘ప్రపంచీకరణ’ మాయల వలనుంచి ఇప్పుడైన మనం బయటపడాలి. లేనట్టయితే దేశమంతటా విదేశీయ, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ ఆర్థిక సామ్రాజ్యాలు విస్తరించిపోతాయి. ఆర్థికంగా మాత్రమే కాదు, సాంస్కృతికంగా కూడ వివిధ దేశాలు దివాలా తీయడానికి ‘ప్రపంచీకరణ’ దోహదం చేస్తోంది. జనానికి దేశభక్తి ధ్యాస తగ్గి ‘వాణిజ్య సామ్రాజ్య సంస్థల’పట్ల భక్తి, నిష్ఠ పెరుగుతుండడం చాపకింద విస్తరిస్తున్న విష జలం..’. పెట్టుబడిదారీ  కాపిటలిస్ట్‌  వ్యవస్థ అంతర్జాతీయంగా విఫలమైంది.

సామ్యవాద కమ్యూనిస్ట్‌  వ్యవస్థ కూడ ఘోరంగా విఫలమైంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ఒక ‘మేధావి’ని సామాన్యుడు అడిగిన ప్రశ్న. ఇది 1992 సంవత్సరం నాటి మాట.. ఆ ‘మేధావి’చేసిన గొప్ప విశ్లేషణ  ఇదీ ‘‘మా అమ్మాయి, ఆమె భర్త ‘ఫలానా’ అమెరికా వాణిజ్య సంస్థకు చెందిన ఉద్యోగులు, జపాన్‌లోని ఈ సంస్థ ‘విభాగం’లో వారు పనిచేస్తున్నారు. ఈ వాణిజ్య సంస్థవారు ఉద్యోగులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారు, వారి పిల్లల కోసం పాఠశాలలు, క్రీడా మైదానాలు నెలకొల్పుతున్నారు. ‘సంస్థ’ వాహనాలలోనే ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉద్యోగుల పిల్లలు పెరిగిన తరువాత వారికి కూడ ఈ ‘వాణిజ్య సంస్థ’లోనే ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సంస్థ ఉద్యోగులది ఒక ‘కుటుంబం’. సర్వం సంస్థవారే సమకూర్చుతున్నారు. అందువల్ల ఈ ‘సంస్థ’కు చెందిన వివిధ దేశాలలోని వారికి ప్రభుత్వంతో ప్రమేయం ఏముంది? దేశంతో ఏం పని ఉంది..?’. ఇలాంటి అంతర్జాతీయ వాణిజ్య భక్తులైపోతున్న వారికి జాతీయత పట్ల, మాతృదేశం పట్ల నిష్ఠ, ధ్యాస క్రమంగా సన్నగిల్లిపోతుండడం సాంస్కృతికమైన దివాలాకోరుతనం, ‘జాతీయ నిష్ఠ’ను ధ్వంసం చేయడానికి కమ్యూనిస్టులు విఫలయత్నం చేయడం దశాబ్దుల విషాదం.. ‘కమ్యూనిస్టులు’ వదలిపెట్టిన కార్యక్రమాన్ని ప్రపంచీకరణ శక్తులు అందిపుచ్చుకున్నాయి!!
-సమీర్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page