నాటడమే కాదు పెంచే బాధ్యతనూ ప్రజలు తీసుకోవాలి
రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం
హైఆరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమన్నారు. మొక్కలు నాటడమే కాదు ఆ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని, మొక్కలు నాటడం సమాజంలో బాధ్యత అని పొన్నం తెలిపారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించదని, ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో మంచి కార్యక్రమంలో మొక్కలు నాటాలని పొన్నం పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 30 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా సోమవారం రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సందర్భంగా హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం మాట్లాడుతూ…మొక్కలు నాటడం ఆడంబరం కాదని, ప్రజలందరూ చిత్తశుద్ధితో వనమహోత్సవంలో పాల్గొనాలని అన్నారు. వొచ్చే పదేళ్లలో తాము నాటే మొక్కలను ప్రజలు చూస్తారన్నారు. గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్లు కూడా పెట్టలేదని, తాము అటవీశాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి చేసే మొక్కలను తీసుకువచ్చి పెంచుతామన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు , కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.