- రిజర్వేషన్లు తొలగిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ను సమర్థిస్తారా?
- దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి..
- మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఇంటర్నెట్ డెస్క్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : జమ్మూకశ్మీర్ ఎన్నికల సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుద చేసిన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకున్నారని, నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో దేశ భద్రతను ప్రశ్నించే అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
పార్లమెంటు ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు జమ్మూకశ్మీర్ లో రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న నేషనల్ కాన్ఫరెన్స్తో ఎలా చేతులు కలుపుతారు? జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ హామీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-A తీసుకొచ్చి తద్వారా.. జమ్మూకశ్మీర్ లో అశాంతి, ఉగ్రవాదం పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ మద్దతిస్తుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం మేం చేస్తున్న యత్నాలకు నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా జమ్మూకశ్మీర్ పేదల రిజర్వేషన్లు తొలగించాలనేదే కాంగ్రెస్ ఉద్దేశమా? ఉమెన్ కమిషన్, ఫారెస్ట్ డ్వెల్లర్స్ చట్టం, సఫాయీ కర్మచారి వంటి ఎన్నో చట్టాల ద్వారా మేం జమ్మూకశ్మీర్ లో మార్పులు తీసుకొస్తే.. వాటిని తొలగించాలని ఎన్సీ చెబుతోంది.
దీన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా? ఉగ్రవాదులను విడుదల చేస్తామంటున్న ఎన్సీకి మద్దతుగా ఉంటారా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ తో మళ్లీ చర్చలు జరపడం, తద్వారా లోయలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందా? పాకిస్తాన్ తో ‘సరిహద్దు వాణిజ్యం’ పేరుతో.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రను కాంగ్రెస్ సమర్థిస్తుందా? ఉగ్రవాదం, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం వంటి కేసుల్లో ఉన్నవారి బంధువులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ద్వారా.. ఉగ్రవాదాన్ని, రాళ్లు రువ్వడం, రోడ్లు బంద్ చేయడం వంటి అరాచక కార్యక్రమాలకు కాంగ్రెస్ మద్దతిస్తుందా? నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో జతకట్టడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక కుట్ర మరోసారి బహిర్గతమైంది. అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
దళిత, గుజ్జర్, బకర్వాల్, ఇతర కొండజాతి వర్గాల రిజర్వేషన్లకు చరమగీతం పాడాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ దురుద్దేశాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ‘శంకరాచార్య హిల్’ ను ‘తఖ్తే సులేమాన్’గా.. ‘హరిపర్వత్’ ను‘కోహే మారన్’గా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోదని ఆరోపించారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో.. రాష్ట్రంలో విభజన రాజకీయాలకు బాటలు వేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతోందని ఆరోపించారు. 370ని రద్దు చేసిన తర్వాత మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్లో అభివృద్ధి జరుగుతోందని, అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు.
రానున్న ఎన్నికలు ఇక్కడి అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలనే అనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, ఉగ్రవాదులను మన దేశంలోకి పంపి విధ్వంసానికి కారణమవుతున్న పాకిస్తాన్ తో చర్చలు అవసరమా? అని ప్రశ్నించారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను సమర్థిస్తారా? పశ్చిమబెంగాల్ లో యువ డాక్టర్ పై హత్యాచారం జరిగితే రాహుల్ ఎందుకు మాట్లాడరు. అని ప్రశ్నించారు. ఔరంగజేబ్ రోడ్డు పేరు మారిస్తే..దేశమంతా ఆందోళనలు చేసిన స్వయం ప్రకటిత మేధావులు .. జమ్మూకశ్మీర్లో పవిత్రమైన శంకారాచార్య పర్వతం పేరును మారుస్తామంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ జమ్మూకశ్మీర్లో ఒంటరిగానే బరిలో నిలుస్తామని, పార్టీ నిర్ణయించిన సీట్లలో పోటీచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.