విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష
నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. 5 పంచాయితీలు ఆంధ్రాలో కలపడం వలన భద్రాచలం మండలానికి పట్టు కోల్పోయినట్లు అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు హైద్రాబాద్‌లో భేటీ కానున్నందున భద్రాచలం మండల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. విభజన సమయంలో ఆర్డినెన్స్‌లో 5 పంచాయితీలు లేనప్పటికి రాష్ట్రం విభజించిన తరువాత 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా వొచ్చిన నారాచంద్రబాబు నాయుడు 5 పంచాయితీలు ఆంద్రాలో కలపాలని కేంద్రంపై వత్తిడి తెచ్చారు.

 

ఆ సమయంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తీసుకు వొచ్చి 5 పంచాయితీలను ఆంధ్రాలో కలుపుకున్నప్పటి నుండి విలీనమైన పంచాయితీల ప్రజలు తెలంగాణలో ఉంటామని గత ముఖ్యమంత్రి కే.చంశ్రేఖర్‌రావుకు, మంత్రులకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేసారు. అయినప్పటికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమాత్రం స్పందించ లేదు. కనీసం ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో అనేకసార్లు కలిసినప్పటికి విలీన పంచాయితీలు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వినపడుతున్నాయి.

ఇప్పటికే విలీన పంచాయితీలు భద్రాచలంలో కలపాలని ఉద్యమం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారర్కకు 5 పంచాయితీల ప్రజలు వినతి పత్రాలు అందచేసారు. అంతే కాకుండా భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య అనేక సార్లు అసెంబ్లీలో చర్చించారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ ‌తెల్లం వెంకట్రావు మంత్రులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా వినతిపత్రాలు అందచేసారు.ఇరువురు ముఖ్యమంత్రులు 5 పంచాయితీలపై చర్చజరుకుని ఏకాభిప్రాయంకు వచ్చి తెలంగాణలో కలపడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషిచేయాలని భద్రాచలం మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page