స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

ప్రతిపాదనలతో ముందుకు రావాలి…పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం
అధునాతన పరిజ్ఞానం అందించాలనేదు ప్రభుత్వ సంకల్పం
మంత్రులతో కలిసి పారిశ్రామిక ప్రముఖులతో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటీ రెండు రోజుల ముందే  స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని  పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం తగిన  నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ ‌స్టాఫ్‌ ‌కాలేజీలో స్కిల్‌ ‌డెవెలప్మెంట్‌ ‌పై సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ ‌స్టాఫ్‌ ‌కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే  బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు.

స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. స్కిల్‌ ‌యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్‌ ఉం‌డాలి.. అటు పరిశ్రమల అవసరాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్‌, ‌కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌?‌బాబుతో  చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే  ఈ బాధ్యతలను చేపట్టాలా… మరేదైనా విధానం అనుసరించాలా.. అనేది కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ ‌ను నియమించుకోవాలని  సీఎం చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్‌ ‌డిపార్టుమెంట్గా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఐటీ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రెటరీ జయేష్‌ ‌రంజన్‌, ‌విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ ‌సెక్రెటరీ అజిత్‌ ‌రెడ్డి, విష్ణువర్ధన్‌ ‌రెడ్డి, డాక్టర్‌ ‌రెడ్డిస్‌ ‌ల్యాబ్‌ ‌ఛైర్మన్‌ ‌సతీష్‌ ‌రెడ్డి,  భారత్‌ ‌బయోటెక్‌ ‌హరి ప్రసాద్‌, ‌క్రెడాయ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌శేఖర్‌ ‌రెడ్డి, ఐ ల్యాబ్స్ ‌శ్రీనిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్‌ ‌స్టాఫ్‌ ‌కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ ‌సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి అందులో ఉండే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page