వివిధ శాఖల అధికారులతో స్పీకర్ సమీక్ష
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు
ఇప్పటికే బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు
బిఆర్ఎస్ నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సవి•క్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్తో పాటు ప్రభుత్వ విప్లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్తో పాటు పలువురు హాజరయ్యారు. అసెంబ్లీ బ్జడెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లికృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వరకు కొనసాగింది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ముఖ్యమైన రైతు భరోసా పథకంపైనా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది.
అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వొస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, జాబ్ క్యాలెండర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈనెల 23 న కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందులో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి పూర్తి స్థాయి బడ్జెట్ను కాంగ్రెస్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఈనెల 25 లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బ్జడెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈసారి జరిగే సమావేశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి అంశాలపై వాడి వేడి చర్చ జరగనుంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా చర్చ జరగనుంది. పలు కీలక బిల్లులు కూడా రేవంత్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఇంకా ఆరు గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదిలావుంటే అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేక పోతున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని సూచించారు. ప్రజాక్షేత్రం లోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తామని, నిస్సృహతో కూడిన ప్రకటనలతో తమలో ఉన్న గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల ప్రజాప్రయోజనం ఉండదన్నారు. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజాభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగు తుందని చెప్పారు. ఇంత జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు. నేలమట్టమైన పార్టీని నాలుగున్నరేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏళ్లు నిరాటంకంగా పరిపాలిస్తామని చెబుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అనుకోవాలన్నారు.