స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం విజయవంతం ..

అధికారులను అభినందించిన సమాచార పౌర సంబంధాల శాఖ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

భద్రాచలం , ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : భద్రాచలంలో రెండు రోజులు పాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభోగంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పోటీపడి వారికి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. చర్యలు చేపట్టారని, సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించారని ఆయన తెలిపారు. మహోత్సవ వేడుకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన పాత్రికేయులను ఆయన అభినందించారు.

వేడుకలు తిలకించేందుకు దేవస్థానం ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా టికెట్ విక్రయాలుకు చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. స్వామివారి వేడుకలు వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించామని భద్రాచలం రాలేని భక్తులు ప్రపంచ వ్యాప్తంగా టివిలు, సోషల్ మీడియా ద్వారా వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు తలంబ్రాలు ఆనవాయితీగా వస్తున్నదని, ఆ క్రమంలోనే సీతారాముల కల్యాణం రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,

మహా పట్టాభిషేకం వేడుకలకు రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో జిల్లా యంత్రాంగం పనిచేసి వేడుకలను విజయవంతం చేశారని అన్నారు. శ్రీరామనవమి రోజున కల్యాణం ముగిసిన తదుపరి భద్రాచలంలో 60 తలంబ్రాలు కౌంటర్లు ఏర్పాటు ద్వారా అలాగే ఆర్టీసీ బస్సులలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని అన్నారు.ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్వామి వారి తలంబ్రాలు కొరియర్, పోస్టల్, కార్గో ద్వారా పొందేందుకు దేవస్థానం భక్తులకు అవకాశం కల్పించారని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page