- నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా
- ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది
- ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఆగస్ట్ 23: చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. జొహెన్నెస్ బర్గ్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా చంద్రయాన్ – 3 ల్యాండింగ్ పక్రియను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సగటు భారీతీయుడిలాగే తానూ పరీక్ష విజయం కోసం ఎదురుచూశానని అన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.
విక్రమ్ ల్యాండర్ సుమారు 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. చంద్రయాన్-3 విజయవంత మైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జొహెన్నెస్బర్గ్ నుంచే దేశ ప్రజలనుద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. స్పేస్ సైన్స్ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ విజయవంతంగా తన విక్రమ్ రోవర్ ను చేర్చటంలో సఫలం కావటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు. దీంతో ఇండియా ప్రపంచపటంలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అన్నారు. ఇది అమృతకాలంలో నెలకొన్న తొలి ఘన విజయం ఇదని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పటికీ తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని చెప్పారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. అద్భుత విజయం కోసం 140కోట్ల మంది ఎదురు చూశారన్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా’నని అని మోదీ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.