వ్యవసాయశాఖ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి4: వ్యవసాయశాఖలో ప్రమోషన్స్పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు.వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని స్పష్టం చేశారు. అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో వ్యవసాయశాఖ డైరీని ఆయన ఆవిష్కరించారు. వ్యవసాయ ఉద్యోగులతో నాకున్న బంధమే తెలంగాణ బంధం.. అని పేర్కొంటూ 2006 నుండి పదహారేళ్లుగా వ్యవసాయ ఉద్యోగుల డైరీని ఆవిష్కరిస్తున్నాను అని తెలిపారు.
రాష్ట్రం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ ఉద్యోగుల సలహాలు తీసుకున్నారు..వారి సూచనలు, సలహాల ఆధారంగా వచ్చినవే తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయరంగ పథకాలు..సమైక్య రాష్ట్రంలో ఆఖరున ఉన్న వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది అని మంత్రి హరీష్ రావు అన్నారు.నల్లచట్టాలతో రైతులు ఉసురు పోసుకున్న పార్టీ తెలంగాణ రైతులు వ్యవసాయ కల్లాలు నిర్మించుకుంటే పైసలు వెనక్కు ఇవ్వమంటున్నది .. అదే పక్క రాష్ట్రంలో కల్లాలు నిర్మించి చేపలు ఎండబెట్టుకుంటే ఓకే అంటున్నది..అని మంత్రి హరీష్ రావు అన్నారు.
32 జిల్లాలకు వ్యవసాయ అధికారులను నియమించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని హరీష్ రావు అన్నారు. కొన్ని శాఖలలో ప్రమోషన్ ఇద్దామన్నా మనుషులు లేరని వాపోయారు. మినిమమ్ పీరియడ్ కాకున్నా కొన్ని శాఖల్లో ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు. ప్రమోషన్స్ ఆపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. పదోన్నతులు ఇవ్వడం లేదన్న నింద తమపై వేయొద్దని కోరారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోతున్నది..మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారానికికొరత వస్తుందని నిపుణులు చెబుతున్నారు..భూసారాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అని పేర్కొన్నారు.
రూ.3.50 లక్షల కోట్లు వ్యవసాయం, సాగునీరు, నాణ్యమైన కరంటు, రైతుబంధు, రైతుభీమా, మౌళిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది..రైతు కేంద్రంగారాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా పలు మార్లు వెల్లడించారు..అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.అబిడ్స్ రెడ్డి హాస్టల్ లో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కృపాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి కృపాకర్ రెడ్డి, వ్యవసాయ ఉద్యోగులు,, తదితరులు పాల్గొన్నారు.