పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు

  • యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయండి
  • దళిత గిరిజన జీవితాల్లో మార్పు వచ్చేలా చర్యలు
  • ఉన్నతస్థాయి సవిూక్షలో డిప్యూటి సిఎం భట్టి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఆగస్ట్‌29: ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకు వొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్  రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు- ప్రణాళికల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవిూక్ష సమావేశం నిర్వహించారు.  సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దశ దిశా నిర్దేశం చేశారు.

అన్ని శాఖల్లో ఉన్న అధికారులు ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం వారి నిధులను వారికే ఖర్చు పెట్టాలని సూచించారు.  ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని సీరియస్‌ గా అమలు చేయడానికి ఉన్నత అధికారులు సాధ్య సాధ్యాలను దృష్టిలో పెట్టుకొని మేధోమధనం చేసి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్  చట్టం  ప్రధాన ఉద్దేశాన్ని అమలు చేసి దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే ఆ చట్టానికి అర్థం, పరమార్థం ఉంటుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సబ్‌ ప్లాన్  చట్టాన్ని ఎంత సీరియస్‌ గా అమలు చేయాలో ఉన్నత అధికారులు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు.

 

ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసిన తర్వాత అన్ని శాఖల అధికారులకు నిధుల కేటాయింపు, ఖర్చు పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను కేటాయించే విషయంలో అధికారులు విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించాలని తర్వాత కమ్యూనిటీ హాల్స్‌ అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాల కోసం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీల భూములను అభివృద్ధి చేయడానికి ఇందిరా జల ప్రభ పథకం అమలు కోసం అధికారులు యాక్షన్‌ ప్లాన్  తయారు చేయాలని సూచించారు. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు దళిత, గిరిజనుల వ్యవసాయం కోసం కావలసిన నీటి వనరులను సమకూర్చడానికి బోర్లు వేయించాలని, భూగర్భ జలాలు పెరగడానికి చెక్‌ డ్యాముల నిర్మాణం చేయాలని చెప్పారు.

 

పోడు సాగు చేసుకునే ఆదివాసి రైతులకు ఆదాయం వచ్చే విధంగా , అడవిని కాపాడుకునే విధంగా ఫామ్‌ ఆయిల్‌, పండ్ల తోటల పెంపకం, అంతర్గత పంటల సాగుకు డిజైన్‌ చేయాలని సూచించారు. అడవి ఆదాయం రెండు ఉండే విధంగా కొత్త పథకాలను తీసుకురావాలని సూచించారు.  స్థానికులు గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల కేటాయింపు, నిధుల ఖర్చు గురించి అధికారులను అడిగి ఆరా తీశారు. గతం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్  చట్టం ప్రకారంగా 24 శాతం నిధులు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడానికి అధికారులు కచ్చితంగా దృష్టి సారించాలని చెప్పారు.

 

అన్ని శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రతినెల సబ్‌ ప్లాన్  చట్టం అమలు, నిధుల వ్యయంపై శాఖల వారీగా సవిూక్ష సమావేశం నిర్వహించి ఆర్థిక శాఖ నుంచి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ సుల్తానీయా, ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్‌ రోస్‌, సోషల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ శ్రీదేవి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రెటరీ శరత్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎం.డి గౌతమ్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page