డిఎస్సీ తుది కీ విడుదల

త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణలో 11,062 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్‌ ‌కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ‌సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌, ‌లాంగ్వేజ్‌ ‌పండిట్‌, ‌ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ‌టీచర్‌ ‌పరీక్షల ఫైనల్‌ ఆన్సర్‌ ‌కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ ‌కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ ‌షీట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ ‌నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి రెస్పాన్స్ ‌షీట్లు డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్‌ ‌కీపై ఏకంగా 28 వేల వరకు అభ్యంతరాలు వొచ్చిన నేపథ్యంలో..తుది ఆన్సర్‌కీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తుది కీలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు మారుతాయో, ఎన్ని మార్కులు కలుస్తాయో అన్న దానిపై ఉత్కంఠగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 10లోపు ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది.  మరోవైపు తుది కీ వెలువడ్డాక డీఎస్సీ రాత పరీక్ష ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  రెండు మూడు రోజుల్లో డీఎస్సీ 80 మార్కులకు, టెట్‌ 20 ‌మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ‌ర్యాంకు లిస్టును విడుదల చేయనున్నారు.

ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ ‌జాబితాను ప్రకటించనున్నారు. వీరికి సంబంధిత డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం మెరిట్‌ ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ’‌కీ’ని పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page