ఎక్స్ వేదికగా సిఎ చంద్రబాబు పోస్ట్
తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం.
ఈ దివ్యక్షేత్రం ఏపీలో ఉండటం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో, శ్రద్దాసక్తులతో స్వామివారిని ఆరాధిస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ఆచారాలను, తితిదే నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.