రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి..

ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ..

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోంద‌ని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో సోమ‌వారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సోమ‌వారం లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారింద‌ని, అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అన్ని పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ బుల్‌డోజర్ పాలన నడుపుతున్నారు. బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారింది. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తూ మీ పార్టీ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుంది.

బుల్డోజర్లు 100 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లను, కార్యాలయాలను, రహదారులను, ఇతర నిర్మాణాల కోసం ఉపయోగించారు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలైన బిజేపీ, కాంగ్రెస్ లు నిర్మాణాలను కూల్చేందుకు ఉపయోగించడం దుర్మార్గం. ఉత్తరప్రదేశ్, దిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఎలా ఉపయోగించిందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తోంద‌ని, ఈ విషయంలో బిజేపీ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నద‌ని పేర్కొన్నారు. బుల్డోజర్ కూల్చివేతల మీద సుప్రీం కోర్టు తాజా తీర్పు ఉన్నప్పటికీ.. తగిన సర్వేలు నిర్వహించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజ్ చేస్తూ, వారిని కన్నీరు పెట్టిస్తున్నద‌ని తెలిపారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలను చట్టాలను గౌరవించే విధంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వమని, తద్వారా రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీకి రాసిన‌ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page