కాంగ్రెస్ ఎంపి అనిల్ యాదవ్పై హరీష్ రావు మండిపాటు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్30 : ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆనంద కన్వెన్షన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు వాటాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎలాంటి రుజువులు లేకుండా అనిల్ కుమార్ యాదవ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తనకు గోల్కొండ, చార్మినార్లో కూడా వాటాలు ఉన్నాయని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్కు లీగల్ నోటీసు పంపుతున్నా.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.