మహాత్ముడి మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ సాకారం

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే నడిచి విజయాలు సాధించాయి. సత్యం, అహింస పునాదులపై క్విట్ ఇండియా అంటూ సాగిన గాంధీజీ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్య‌మ‌ స్ఫూర్తి.. ఇంకా కొన్ని శతాబ్దాలు మానవ నాగరికతకు మార్గదర్శనం చేస్తాయి.”మరో వెయ్యి సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు ఈ నేలమీద జన్మించడని ” ఐక్యరాజ్యసమితి గాంధీజీకి నివాళులర్పించింది. ఆల్బర్ట్ ఐన్ స్టీన్, జార్జ్ బెర్నార్డ్ షా, రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, చార్లీ చాప్లిన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, దలైలామా, బరాక్ ఒబామా, ఆంగ్ సాన్ సూకీ, స్టీవ్ జాబ్స్, మలాలా వంటి విశ్వవిఖ్యాత వివిధ రంగాల ప్రముఖులు సైతం గాంధీజీ నుంచే స్ఫూర్తి పొందారు. నేటికీ స్ఫూర్తి పొందుతూనే వున్నారు.

కొన్ని దశాబ్దాలుగా వివక్షకు, అన్యాయానికిలోనై దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రాష్ట్ర సాధన అని నమ్మి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తెలంగాణ ఉద్యమం కూడా చాలా వరకు గాంధీజీ చూపిన మార్గంలోనే కొనసాగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర‌రావు, ప్రొఫెసర్ కోదండరాం వంటి తదితరులు ప్రముఖ పాత్ర పోషించిన కార్యక్రమాలన్నీ దాదాపు శాంతియుత కార్యక్రమాలే..  ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27 న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించి, సాధించిన తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ గాంధీజీని విపరీతంగా ఆరాధిస్తారు. గాంధీజీ స్ఫూర్తితోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తన పార్టీ ఆవిర్భావం సందర్భంగా “తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని,ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని”కెసిఆర్ పలికిన మాటలే ఇందుకు సాక్ష్యాలు..!

రాజకీయ కోణాలు, వివిధ రాజకీయ పార్టీల విమర్శలు ప‌క్కనబెడితే, తెలంగాణ ఉద్యమంలో,  పదేళ్ల తెలంగాణ రాష్ట్ర పాలనలో గాంధీజీ ఆశయాలను, ఆలోచనలను కెసిఆర్ చాలా వరకు పాటించే యత్నం చేశారు. నేటి నవతరానికి, భవిష్యత్తు తరాలకు గాంధీజీ గొప్పతనం తెలియ‌జేసే కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది రాజకీయ నాయకులు గాంధీజీ గురించి విమర్శలు చేస్తూ తక్కువగా చూపిస్తూ మాట్లాడిన సందర్భంలో అలాంటి వారి ఆలోచనలను కెసిఆర్ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రజావేదికల ద్వారా ప్రజాపక్షంగానే తీవ్రంగా వ్యతిరేకించారు.”మహాత్ముడిని కించపరిచే కొన్ని మాటలు విన్నప్పుడు నా హృదయం చాలా బాధ పడుతుంది. నాకు దుఃఖం కలుగతది. కానీ అలాంటి వారి మాటల వల్ల గాంధీజీ కీర్తి, స్ఫూర్తి ఏమాత్రం తగ్గదు. ఆయన గొప్ప మానవతావాది. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడే. శాంతిదూత, విశ్వ మానవుడు. అంతర్జాతీయ స్థాయిలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇండియా నుంచి వచ్చాను అని చెబితే… ఓహో మహాత్మా గాంధీజీ పుట్టిన స్థలం కదా అంటారు.

“అని కెసిఆర్ చాలా వేదికలపై ప్రసంగించారు.గాంధీజి 150 జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా,మన స్వాతంత్ర్యదినోత్సవ అమృత మహోత్సవాలు దేశమంతా ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దానిని రాజకీయాలకతీతంగా అందరూ సమర్థించి, సహకరించాలని చెప్పి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రిచెర్డ్ అటెన్ బరో దర్శకత్వంలో 1982 లో తెరకెక్కి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన “గాంధీ” సినిమాను తెలంగాణ లో దాదాపు 22.5 లక్షల మంది విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించారు. నవయువ తరాలు గాంధీజీ గురించి తెలుసుకొని, భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఒక్కడు, బక్కోడు… వీని వల్ల రాష్ట్రం వస్తదా అని ఎంతోమంది ఎన్నో సార్లు అపహేళన చేసినప్పుడు, ఎన్నో విమర్శలు, ఓటములు ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నా మనస్సులో గాంధీజీని స్మరించుకునేవాడిని. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన ప్రబోధించిన అహింస, శాంతి, సత్యం మార్గంలోనే పోరాడి మనం తెలంగాణ సాధించామని కెసిఆర్ చాలా వేదికలపై ప్రకటించారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక మనదేశం గురించి, స్వాతంత్ర్యం అవసరమ‌ని గుర్తించి  మనదేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గురించి పూర్తిగా శోధించి అధ్యయనం చేశాక తన విధివిధానాలతో రైళ్ల ద్వారా, పాదయాత్ర ద్వారా సామాన్య ప్రజల్లోకి వెళ్ళి స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు.

విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన‌ 34 కోట్ల మంది భారతీయులను ఏకతాటిపై తీసుకువచ్చి ఎన్నో శాంతియుత నిరసనలు, నిరాహారదీక్షలు, సత్యాగ్రహ ఉద్యమాల ద్వారా “చేయండి లేదా చావండి” అని సమరశంఖం పూరించి ఈ దేశానికి స్వాతంత్య్రం అందించారు.కెసిఆర్ కూడా తెలంగాణ ఉద్యమ స్థితిగతులపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గదర్శనంలో తెలంగాణ గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకొని తన రాజకీయ చతురత, వ్యూహాలతో తన వాగ్ధాటితో తెలంగాణలోని సాధారణ, సామాన్య ప్రజలకు కూడా జై తెలంగాణ నినాదాన్ని చేరువ చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీలు తదితరులందరినీ కలిపి పాఠశాల మొదలు విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు కీలకమయ్యేలా మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి నిరసన ప్రదర్శనలతో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలను, బహిరంగ సభలను నిర్వహించారు. చివరకు “తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ చచ్చుడో..”అంటూ 2009 నవంబర్ 29 నుంచి 11రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష ద్వారా డిసెంబర్ 9 ప్రకటనకు కారణమయ్యారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలకు కూడా భయపడకుండా రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రి గా పాలన అందించారు.

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని, రైతే దేశానికి రాజు అని గాంధీజీ చూపిన మార్గంలోనే కెసిఆర్ తన పాలనలో గాంధీజీ మార్క్ చూపారు. రైతు బంధు, రైతు బీమా వంటి విప్లవాత్మక ప‌థ‌కాల‌తో ఐక్యరాజ్యసమితిని సైతం ఆకర్షించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలను కొనసాగిస్తూనే జాతి సమగ్రత, పరమత సహనానికి పెద్దపీట వేశారు. గాంధీజీలోని ఆధ్యాత్మిక, నైతిక, మానవీయ విలువలను కూడా కెసిఆర్ కొంతమేరకు ఆచరించే యత్నం చేశారు. రాజకీయంగా విభేదించే ఎంతోమంది మనదేశ ప్రముఖులు కూడా కెసిఆర్ పోరాట పంథాను, దార్శనికతను, వ్యవసాయాభివృద్ధి కోసం ఆయన అనుసరించిన పథకాల అమలును అభినందిస్తున్నారు.ఈ రెండు దశాబ్దాల కాలంలో ఈ దేశాన్ని ప్రభావితం చేసిన పదిమంది రాజకీయ ప్రముఖుల్లో కెసిఆర్ ఒకరని సామాజిక,రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు జాతీయ మీడియాలో వివిధ సందర్భాలలో విశ్లేషించారు. గాంధేయ మార్గాన్ని నమ్మి,నడిచి కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన ప్రముఖుల్లో కెసిఆర్ ఒకరు.ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ “అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తే కెసిఆర్ జాగ్రఫీ క్రియేట్ చేశారు. ఒక పని జరగడానికి చాలా తక్కువ మాత్రం అవకాశం వుందని తెలిసి కూడా, దాన్ని సాధించడానికి కొత్త మార్గాన్ని వేసి ఒక్కడే ఓ సైన్యంగా బయలుదేరి విజయం సాధించే సాహాసికుల్లో కెసిఆర్ ఒకరు”అన్నారు.

“రక్తమాంసాలతో కూడిన గాంధీజీ లాంటి ఓ యుగపురుషుడు భూమిపై నడిచాడంటే రాబోయే తరాలు నమ్మవు”అని గాంధీజీ పట్ల తన నివాళి ప్రకటించారు విశ్వ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్.మరి నేడు ప్రకృతి, పర్యావరణం,విద్య,పారిశ్రామికం, వ్యాపారం,మతం,దైవం,యుద్దం,వైద్యం,ఆధునికం, శాస్త్ర సాంకేతిక కృత్రిమ మేధ వంటి ఏ అంశాలకు సంబంధించిన విషయంలోనైనా గాంధీజీ సూచించిన విలువలు,ఆదర్శాలే పరిష్కారాలుగా కనబడుతున్నాయి.ప్రేమ,శాంతి,సత్యం, అహింస వంటి మార్గాలే అనుసరణీయం అని బోధిస్తున్నాయి. గాంధీజి జయంతి  సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను,  తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకుంటూ మన  రాష్ట్రం మన దేశానికి,మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా వుండాలని ఆకాంక్షిస్తూ.. ఆ ప్రస్థానంలో మనమంతా బాధ్యతగా నడుచుకుందాం
మేరా భారత్ మహాన్.
జైహింద్,జై తెలంగాణ

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page