- పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..
- ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేడు నియామక ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిశీలించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కలెక్టర్లకు పంపించామని, అభ్యర్థులకు సమాచారం అందించామని విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం సీఎస్కు తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బస్సులకు పార్కింగ్, దిగే స్థలాలను ఎస్పీలకు తెలిపామని అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. పోలీసు శాఖకు చెందిన 33 మంది నోడల్ అధికారులు ఆర్టీసీ, విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బస్సులు సజావుగా రాకపోకలు సాగించేందుకు, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభాస్థలికి చేరుకోనున్నారు. అభ్యర్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన అన్ని బస్సులు షెడ్యూల్ సమయానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. అభ్యర్థులు తమ ఇళ్లకు చేరుకునే వరకు ఆయా శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.