హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్
చెరువులు, ఇతర ఆక్రమణలపై ఫిర్యాదులు చేయండి
ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపున ఉన్న చెరువుల పరిరక్షణకు
ప్రత్యేక యాప్ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని
కల్పిస్తున్నామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్పీసి) చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్
వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న ఈ ప్రత్యేక యాప్లోనే చెరువులతో పాటు ఇతర పబ్లిక్ ప్రాపర్టీస్ ఆక్రమణలపై ఫిర్యాదులు చేయాలని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు వెల్లడించారు. ఔటర్ లోపలి వైపున ఉన్న చెరువులకు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమగ్రం గా చర్చించినట్టు వెల్లడించారు.
ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు,ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక ప్లాన్ తో ముందుకు వెళ్ళనున్నట్టుతెలిపారు. చెరువుల ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ను తీసుకొస్తున్నట్టు ఆయన ప్రకటించారు. చెరువుల్లోనూ, ప్రభుత్వ స్థలాల్లోనూ, రో డ్లలోనూ, పార్కుల్లోనూ ఎక్కడ ఆక్రమణలు జరిగినా.. యాప్లో ఫిర్యాదు చేయాలని, ఈ యాప్లో సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు రంగనాథ్ తెలిపారు. వొచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.