నేవీ రాడర్ కేంద్రంపై అపోహలు వద్దు..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశ రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో కలిసి పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కొండా సురేఖ,నావీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్ఎఫ్ సీ వంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందిందని తెలిపారు. కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీఎల్ఎఫ్ తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారని, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణమని, ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు.
వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలని హితువు పలికారు. దేశం ఉంటేనే మనం ఉంటామని, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలన్నారు. 2 017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు వంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించామని, దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలుగుతామని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రేమికులు గుర్తించాలని కోరారు.
దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు… దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరారు. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని, ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.