నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
గవర్నర్ను కలిసి విన్నవించిన బిజెపి బృందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్21: హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు. సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ గుడి ద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొంతమంది చేస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే పోలీసులు దుర్మార్గంగా లాఠీ ఛార్జ్ చేసి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు నగరంలో ఎంతో మంది బలయ్యారన్నారు. మళ్లీ అలాంటి దాడులకే దుర్మార్గులు కుట్ర చేస్తున్నారని.. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్ను కోరామన్నారు. పోలీసులే మప్టీలో రెచ్చగొట్టి ర్యాలీలో దాడులు, లాఠీఛార్జ్ జరిగేలా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంత వరకు ఖండించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. హిందూ దేవాలయాల ద దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోందని ప్రశ్నించారు. వంద మంది నగరంలో దాడులకు కుట్ర చేసినట్లు తెలుస్తోందని.. రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని నిలదీశారు. ‘దేవాలయాల ద దాడి మా తల్లి ద దాడిలా భావిస్తాం… తిప్పికొడతాం‘ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం బీజేపీ బృందం డీజీపీ ఆఫీసుకు బయలుదేరింది.
గవర్నర్ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్కు ఒకే కారులో ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా నేతలున్న కారును ఎంపీ రఘునందన్ రావు స్వయంగా నడిపారు. కాసేపటికే డీజీపీ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం.. డీజీపీ జితేందర్ను కలిశారు. ముత్యాలమ్మ గుడి ఇష్యూ, హిందూ సంఘాల లాఠీఛార్జ్ అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.