మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాలో భారాస నాయకులను అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వేచ్ఛగా జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణను, నిర్బంధాల మధ్య నిర్వహించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాపాలన అంటూ నిర్బంధ పాలన కొనసాగించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్రమంగా అరెస్టులు చేసిన భారాస నాయకులు, ప్రజా సంఘాల నేతలు, పర్యావరణవేత్తలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.