- మూసీ సుందరీకరణ పేరుతో స్కామ్
- సుందరీకరణకు ఓకే…ఇళ్లు కూల్చివేతలకు నో
- బిఆర్ఎస్ బాటలోనే రేవంత్ సర్కార్
- రాబర్ట్ వాద్రాకు ప్రాజెక్ట్ కట్టబెట్టే యత్నం
- మూసీ బాధితులకు మద్దతుగా ధర్నాలో బిజెపి నేతల విమర్శలు
మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పరీవాహకంలో పేదలను తరిమివేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బిజెపి మరోసారి స్పష్టం చేసింది. పేదలకు అన్యాయం చేయకుండా మూసీ సుందరీకరణ చేపడితే తాము కరసేవ కూడా చేస్తామని స్పష్టం చేసింది. మూసీ పేదలకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద బిజెపి చేపట్టిన ధర్నాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. మూసీ ప్రాజెక్ట్కు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి వొచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారు మూడు నెలల పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటే ప్రాజెక్టును విరమించుకుంటానంటూ సీఎం రేవంత్ చేసిన సవాల్ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం.. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసం వారి ఇళ్లలో నివాసం ఉండేందుకు మేము సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి 10 నెలలు పూర్తి కావస్తోందని.. నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికి రేవంత్ సర్కార్ శంకుస్థాపన గానీ, భూమి పూజ గానీ చేయలేదని విమర్శించారు. కొత్తగా ఇవ్వకపోగా ఏండ్లుగా నివసిస్తున్న పేదల ఇండ్లను కూలుస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని.. ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చి మసిపూసి మారేడుకాయ చేశారన్నారు. ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. ప్రజల ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారని తెలిపారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ పేదల ఇండ్లను కూలిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ సుందరీకరణ చేసుకోవాలన్నారు.
మూసీ బాధితులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్కు మూసీ పక్కన ఉండలేక పోతున్నామని చెప్పారా.. మా ఇండ్లు కూల్చమన్నారా? రేవంత్కు కల వొచ్చినట్లు ఉంది. అయితే ఆ కల లక్షన్నర కోట్లపై అయి ఉండొచ్చు.. కానీ పేద ప్రజలకు మంచి చేయాలనేది మాత్రం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకు అండగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. వారికోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకైనా, చర్లపల్లి జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ పోలీసులతో వొస్తాడా? ఎలా వొస్తాడో కానీ బస్తీల్లోకి రావాలి. ఆయన్ను ప్రజలు ఏమనకుండా మేము రక్షణగా ఉంటాం.. సెక్యూరిటీ విషయంలో ఆయనకు చింత అక్కర్లేదు. డ్రైనేజీ సిస్టం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం.
రేవంత్కు పేదలకు కనీస సౌకర్యాలు అందించడం ముఖ్యమా.. మూసీ సుందరీకరణ అవసరమో తేల్చుకోవాలి. వాస్తవానికి మాకు రెండూ ముఖ్యమే.. కానీ ముందు పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించి తర్వాత సుందరీకరణ చేసేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ, దశ లేదు. ఎలా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో కూడా తెలియడం లేదు. ఒక బస్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని తెలిసింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆవేదన చెందకండి.. మీకు అండగా బీజేపీ ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.