అభివృద్ది ఫలాలను నిరుపేద గిరిజనులకు అందించాలి

  • అభివృద్ది ఫలాలను నిరుపేద గిరిజనులకు అందించాలి
  • రాష్ట్ర ప్ర‌గ‌తిలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి
  • జిల్లా అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల అమలుపై ప్రశంసలు
  • రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ

అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద గిరిజనులకు అందేలా చూడాల‌ని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం అయన భద్రాద్రి కొత్తగూడెం సమీకృత క‌లెక్ట‌రేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. జిల్లాకు వొచ్చిన గవర్నర్‌ ‌కు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ ‌బలరాం నాయక్‌, ‌కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌, ఐటీడీఏ పీవో బి. రాహుల్‌, ఎస్పీ రోహిత్‌ ‌రాజ్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్క‌డ‌ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ‌జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా గవర్నర్‌ ‌కు వివ‌రించారు.అనంతరం గవర్నర్‌ ‌మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు.

ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో, ఆదివాసీ గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్‌ ‌కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 481 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని అన్నారు. స్వచ్ఛభారత్‌ అనేది ఒక ఉద్యమమని, ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, గిరిజన కుటుంబాలను భాగస్వాముల‌ను చేయాలని కోరారు. ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుంచి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రచయితలు, కళాకారులను భాగస్వాములు చేయాల‌న్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు అలాగే ఆదివాసీ గిరిజన మహిళలు తయారుచేసిన గిరిజన వంటకాలు చాలా బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారతపై ఆధారపడి ఉందని, తాను కలెక్టర్‌ ‌కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూశాన‌ని, ‌సహాయక మహిళలు, గిరిజన మహిళలు వారు తయారు చేసిన చేతి వృత్తులు అద్భుతంగా ఉన్నాయ‌ని కితాబిచ్చారు.

అలాగే స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళలు, గిరిజన మహిళల గురించి సమాజానికి తెలియజేయాలని అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 90.6% గిరిజన సంక్షేమ శాఖ గిరిజన విద్యార్థులు పదో తరగతిలో 92 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నదులు, అటవీ సంపద, బిపిఎల్‌, ‌కెటిపిఎస్‌, ‌జెన్కో, భారత్‌ ‌జల నీటి శుద్ధి కర్మాగారం, సింగరేణి గనులు ఉన్నాయని తెలిపారు. భద్రాచలం, పర్ణశాల లోని సీతారామచంద్ర స్వామి దేవాలయాల పరంగా పర్యాటక శాఖను అభివృద్ధి చేసుకొని ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చని, విద్య, ఆరోగ్యం, కల్చరల్‌ , ‌వ్యవసాయం ఉపాధి అవకాశాలలో జిల్లాకు జిల్లాకు మధ్య పోటీతత్వం ఉంటే అభివృద్ధి అనేది తప్పనిసరిగా సాధ్యమవుతుందని ముఖ్యంగా గిరిజన గ్రామాలలో నివసిస్తున్న మారుమూల ప్రాంత కొండ రెడ్ల గిరిజన విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులే కాకుండా ఇతర రైతులు కలానుగుణంగా పంటలు పండించుకొని వృద్ధిలోకి రావాలన్నారు. జిల్లా అభివృద్ధి గురించి పవర్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా జిల్లా కలెక్టర్‌ ‌వివరించిన విధానం చాలా బాగుందని అన్నారు.

జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ‌జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యానం, సంక్షేమం, నీటిపారుదల, విద్యుత్‌, ‌పౌర సరఫరాలు, గిరిజన సంక్షేమం, తదితర ముఖ్యమైన శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సవివరంగా పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా వివ‌రంచారు.వివిధ రంగాలలో విశిష్ట సేవలందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాలలో చేసిన కృషిని రాష్ట్ర గవర్నర్‌ ‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర గవర్నర్‌ ‌విష్ణుదేవ్‌ ‌వర్మను కవులు రచయితలు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మరియు ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ వెంకటేష్‌ ‌శ్యామ్‌, ‌జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌, అదనపు కలెక్టర్‌ ‌వేణుగోపాల్‌, ‌స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ‌విద్యా చందన,కొత్తగూడెం ఆర్డీవో మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్‌ ‌రావు, మరియు జిల్లా అధికారులు ఐటిడిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page