- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..
- రైతుల సమస్యల పరిష్కారానికి పొలంబాట
- డిప్యూటీ సీఎం ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలందించాలనిఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో విద్యుత్ శాఖ పనితీరుపై, విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాబోయే కాలానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ఎంత ఉన్నా అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గరిష్ట డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా అందించామని తెలిపారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు, వరదల సమయంలో అర్థరాత్రి సైతం నీళ్లల్లో పనిచేసిన విద్యుత్ సిబ్బందిని అభినందించారు. ఆపత్కాల సేవలు వెలకట్టలేవని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని భట్టి సూచించారు.