ఇక లైవ్ స్ట్రీమింగ్లో కేసుల విచారణ
ప్రత్యేక యాప్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు
సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై ‘సుప్రీమ్’లో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది.
యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ ’సేన లబ సేన’ కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో షిండే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణలను లైవ్ స్టీమ్రింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆచరణలోకి రాలేదు.
అయితే, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ రోజు.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్టీమ్రింగ్ చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణల వంటివాటిని దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు.