సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్14: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్రావు పేర్కొన్నారు.
గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్లాం.. రేవంత్ రెడ్డి వస్తున్నాడని అతని సెక్యూరిటీ నా గొంతు నొక్కి తోసేశారు, నా మిత్రుడు యాదగిరి కాలి పైన తొక్కితే నెత్తురు వొచ్చిందని మాడభూషి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వొస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతి వాడిని చంపేయాలా? అని ప్రశ్నించారు. అదృష్టవశాత్తు చావు నుంచి తప్పించుకుని, బయటపడ్డాం. సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. అలయ్ బలాయ్ లేకపోతే మానేయండి.. సామాన్యుల్ని చంపకండి బండారు దత్తాత్రేయ అంటూ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.