నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు..
కెటిఆర్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన బాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను.
లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా.. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళ్తాం అని అని బండి సంజయ్ పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్రమంతి ఘాటైన జవాబిచ్చారు.
తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. విమర్శలకు నోటీసులే సమాధానమా.. అయితే నీకు నోటీసులు పంపుతా… కాచుకో. నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా.. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన. మాటకు మాట… నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూసినట్లు తెలిపారు.