హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో సిఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ ఉద్యోగస్తులతో కలసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను సచివాలయ ప్రాంగంణంలో నిర్వహించడంపై సిఎస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుంచి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగిణులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.