రేపు ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • పదివేల మంది మహిళలతో ఆటపాటలు..
  • కళాకారులతో భారీ, ర్యాలీ, ఆకట్టుకునేలా లేజర్ షో
  • బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సిఎస్. శాంతికుమారి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సుమారు 10 వేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా గల అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ ల నుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని పండుగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్న బతుకమ్మ ఘాట్ తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ ల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. సాయంత్రం 5 .30 నుంచి 7 .30 గంటల మధ్య ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతీ శాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సి.ఎస్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వాణి ప్రసాద్, దాన కిషోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు,హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వీ ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page