రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు .. కానీ మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు ఎలా చేస్తారు.? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ జాబ్ పోగొట్టండి. మీకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వోచ్చి ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని కేటీఆర్ తెలిపారు. మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నాడు.
కోటి 60 లక్షల మంది మహిళలు రూ. 2500ల కోసం వేచి చూస్తున్నారు. వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఉన్న రైతు బంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదు. వాళ్లు ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కల్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తానని మోసం చేశాడని మండిపడ్డారు. కనీసం తులం ఇనుము కూడా ఇవ్వడని విమర్శించారు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చు. మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు కొనసాగుతూనే ఉంటాయని, మనం ఏదైనా సమస్య వొస్తే కలెక్టర్లకు చెప్పాలంట. ఇంటింటికి వోట్ల కోసం వొచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట. ప్రజలకు ఏం ఖర్మ. ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలి. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను పట్టుకొని మనం అడగాలని కేటీఆర్ సూచించారు.