దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉన్నత సంకల్పంతో ఇక్కడ దత్త మండపాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషకరమని అన్నారు.
సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే చోట అభివృద్ధి జరుగుతుందని, కష్టాలతో వచ్చిన ప్రజలకు ఈ మంటపం ప్రశాంతతను ప్రసాదిస్తుందని అన్నారు. మైసూర్ లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషాన్నిస్తుందని, ఇది తెలంగాణకు శుభ సూచకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా రాష్ట్ర ప్రజలకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.