CM Revanth Reddy | హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్గా స్వీకరించామని తెలిపారు.
అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఆదాయ లీకేజీలు అరికట్టామని, కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి యత్నాలు చేస్తున్నామని తెలిపారు. . ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుసార్లు దిల్లీ వెళ్లా.. ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతి పత్రాలు ఇస్తున్నాం. నా దిల్లీ పర్యటనల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్ సీఎంను కాదు… పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను దిల్లీకి వెళ్లడం లేదు. దిల్లీ ఏ పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనో లేదు… అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుంచి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా దిల్లీకి వెళతానని స్పష్టం చేశారు.