వారి కుటుంబాలకు అన్యాయం చేయొద్దు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ లో 118 జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాజకీయ కక్షతోనే బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని, జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవొద్దని, ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.