రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం
ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బిజెపి నేతల విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతు హామీల సాధన కోసం భాజపా ప్రజా ప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు జరిగే ఈ దీక్షను ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు.
అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్బాబు దీక్షలో కూర్చున్నారు.
ఈసందర్భంగా ఏలేటి మాట్లాడుతూ రైతులు ఓట్లేస్తే కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో కేసీఆర్ కూడా పూర్తి చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి హామీని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు.