భద్రాచలం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా: ఎమ్మెల్సీ కోదండరామ్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలోకి తీసుకువొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని భద్రాచలం అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని టిజెఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉదయం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ అందరిని పలకరించి భద్రాచలం ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృస్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అనంతరం సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్షేత్ర విశిష్టతను ఆయనకు వివరించారు.
తదుపరి లక్ష్మీతాయారమ్మ వారి కోవెలలో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలంలో ప్రదానంగా మూడు సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి నెరవేరే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. టిఎస్ఆర్జేసి కళాశాల, పాఠశాలలో ఉన్నత విద్య భోధన అందిస్తునప్పటికి స్కూల్ పిల్లలకు కళాశాల పిల్లలకు భోజన వసతి ఒకటే ఉండటం ఇబ్బందికరంగా ఉందన్నారు.
ఆదివాసీలు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వారిని కుల పత్రాలు ఇవ్వడం లేదని దాని వలన ఉద్యోగాలు రావడం లేదని కాబట్టి కులపత్రాలు ఇప్పించాలని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాగే భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే 20 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైందని ఈ సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత త్వరగా న్యాయం జరిగేల చూస్తానని ఆయన తెలిపారు. ఐదు పంచాయితీలు ఆంధ్రాలో కలవడం భద్రాచలంలో ఉన్న అన్నీ వర్గాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకు న్యాయం చేసేల చూస్తానని తెలిపారు.