హైదరాబాద్, ప్రజాతంత్ర : నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతి మించింది.. పెళ్లి బరాత్లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిపపోయేలా డీజే (DJ System)లను మోగిస్తున్నారు. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే కాదు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి.. డీజేపై ఇటీవల భారీగా ఫిర్యాదులు అందాయి.. డీజేల వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో డీజేపై నిషేధం విధించాలని.. భారీ టపాసులు పేల్చేందుకు అనుమతులు ఇవ్వొద్దంటూ పలువురు రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా మంది అభిప్రాయాలను వెల్లడించారు.. ఇలా అన్ని వర్గాల పెద్దల నుంచి.. అన్ని పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం డీజేలపై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో డీజేలు, టపాసులపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే..
హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించొద్దని తెలిపారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. సౌండ్ సిస్టమ్కు కూడా పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఆనంద్ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం కూడా నిషేధమని చెప్పారు.నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పష్టంచేశారు.
సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అని.. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టంలో పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించినట్లు సీపీ తెలిపారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టంలో వాడొద్దని అన్నారు. రాత్రి వేళలో 45 డేసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం ఉపయోగించొద్దని చెప్పారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు రూ.5000 రూపాయల జరిమానా విధిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.