దిల్లీ నుంచి వొచ్చిన ప్రత్యేక బృందాలతో సోదాలు
తెలంగాణ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వొచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేసింది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు,
బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టింది. ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంటిలో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధం లేదని తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు జరుగుతున్న రైడ్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్గా మారారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చానీయాంశమవుతోంది. ఆ క్రమంలో వరుసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది.