ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో 70వ ర్యాంక్‌ వచ్చిన రవళి బీసీ బి అమ్మాయికి ఉద్యోగం రాలేదు, 180వ ర్యాంక్‌ వచ్చిన ఓసి అమ్మాయికి  ఉద్యోగం వచ్చింది. ఇంకో జిల్లాలో 70వ ర్యాంక్‌ వచ్చిన బీ సీ డీ అబ్బాయికి జాబ్‌ రాలేదు, కానీ 385 ర్యాంక్‌ వచ్చిన ఓసి అబ్బాయికి జాబ్‌ వచ్చింది. మహబూబ్నగర్‌, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, ఆదిలాబాద్‌, నల్గొండ ఇలా 33 జిల్లాలో ఇదే పరిస్థితి. ఇవి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ లకు జరిగిన అన్యాయానికి కొన్ని ఉదాహరణలు.

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా
ఈడబ్ల్యూఎస్‌ 10శాతం రిజర్వేషన్స్‌ వల్ల బీసీ,ఎస్సీ,ఎస్టీ బిడ్డలకు, ముఖ్యంగా బీసీ బిడ్డలకు రావల్సిన 11 వందల ఉద్యోగాలు  రాకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టీ మొత్తం 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే, ఈడబ్ల్యూఎస్‌ పది శాతం రిజర్వేషన్స్‌ వల్ల 3000 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు కోల్పోయారు. అంటే బీసీ బిడ్డల నోటికాడి కూడును అన్యాయంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పేరా అగ్రకులాల పిల్లలకు కట్టబెట్టారు.ఈ నష్టానికి కారకులెవరు? ఈ విధానాన్ని తెచ్చిన పాలకులు దీనిని ఎలా సమర్ధించుకుంటారు? ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా? ఏ దేశ రాజ్యాంగమైన ఇలాంటి విధానాన్ని అనుమతిస్తుందా? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా?

రిజర్వేషన్స్‌ ఎవరికి ఇవ్వాలి?
తరతరాలుగా దోపిడీకి గురైన కులాలకు, సామాజికంగా వివక్షతకు గురి అయిన కులాలకు, విద్యా పరంగా, సామాజికంగా వెనకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాతలు సామాజిక కోణంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిందే రిజర్వేషన్‌ విధానం. నిజానికి రాజ్యాంగ రచనలో బీసీలకు అన్యాయమే జరిగింది.ఎస్సీ, ఎస్టీ లతో  పాట్ఱె బీసీలకు రిజర్వేషన్లు ఆనాడే లభించాల్సింది. అంబేద్కర్‌ గారు ఆ ప్రయత్నం చేసినప్పటికీ అగ్ర కులాలతో నిండిన రాజ్యాంగ సభ ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. రాబోయే   ప్రభుత్వాలు ఇతర వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం తగు చర్యలు తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగం పేర్కొంది.

1950 నుంచి బీసీలు పోరాటం చేస్తే కాక కాలేశ్వర్‌ కమిషన్‌ వేసి, రిపోర్ట్స్‌ను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టారు. జనతా ప్రభుత్వం బీసీలా స్థితిగతుల అధ్యాయనానికి మండల కమిషన్‌ను నియమించినప్పటికి రిపోర్టు ఇచ్చే నాటికి ప్రభుత్వం కూలిపోవడంతో ఆ రిపోర్టును అట్టక్కేకించారు. చివరకు వీపీ సింగ్‌ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేశారు.40 సంవత్సరాలు పోరాడితే గాని బీసీలకు రిజర్వేషన్లు రాలేవు.ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుకొని ఓపెన్‌ కేటగిరిలో పోటీపడుతున్నారు బీసీ బిడ్డలు. నాడు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఆ పార్టీయే ఏ రకమైన పోరాటం చెయ్యకపోయినా, కమిషన్‌ రిపోర్టు లేకపోయినా, ఏకపక్షంగా, మెజార్టీ ఉందని, రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను తీసుక వచ్చి ఇప్పుడిప్పుడే ఓపెన్‌ కేటగిరిలో పోటిపడుతున్న బీసీ బిడ్డల నోట్లో మట్టి కొట్టింది. తానతందానా అన్నట్లు బిసి కమిషన్లు సూచించిన విధంగా బి సి రిజర్వేషన్స్‌ పెంచమంటే 50 శాతం సీలింగ్‌ విధించిన న్యాయశాఖ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌  ద్వారా 50శాతం సీలింగ్‌ దాటిన రిజర్వేషన్లను సమర్ధించడం విస్మయానికి గురి చేసింది. ఈడబ్ల్యూఎస్‌ అమలుకై విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా 10 శాతం సీట్లను పెంచుతామని తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం జరగదని నమ్మపలికిన కేంద్రం ఎన్ని విద్యా సంస్థల్లో 10శాతం సీట్లు పెంచింది. సూపర్‌ న్యూమారీ పోస్టులు సృష్టిస్తం అన్న కేంద్రం ఏ శాఖలో ఎన్ని పోస్టులు సృష్టించింది? ఈడబ్ల్యూఎస్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రత్యేక సీట్లు, సూపర్‌ న్యుమారీ పోస్టులు సృష్టించే అమలు చేస్తున్నాయా? మన రాష్ట్రంలో వైద్య విద్యా సంస్థలో ఏమి జరిగింది? ప్రత్యేక సీట్లలో, సూపర్‌ న్యుమరీ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు వాటా వుండదా?

ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్‌ ఓసిలతో పాటు ఎస్సీ ఎస్టి, బీసీలకు కూడా వర్తింపజేసిన కొంత న్యాయంగా అనిపించేది. అలా కాకుండా ఎస్సీ,ఎస్టి బీసీ రిజర్వేషన్‌ వర్తిస్తే ఈడబ్ల్యూఎస్‌ వర్తించదని ప్రత్యేక నిబంధన పెట్టీ ఓసి పక్షపాతాన్ని చాటుకుంది ఈడబ్ల్యూ ఎస్‌ తెచ్చిన ఆ పార్టీ. ఓసిలకే ఈడబ్ల్యుఎస్‌ అన్నప్పుడు ఓపెన్‌ కేటగిరీ 50శాతంలో  నుంచే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు10శాతం తీయాలి. కానీ మొత్తం 100% లో 10శాతం తీయడం అంటే అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలా పోస్టులని లాగేసుకుని ఓసి లకు ఇచ్చినట్లు కాదా? ఈ మధ్యనే ఈ విషయం పై మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టి, బీసీలకు ఒక నిబంధన, అగ్ర వర్గ కులాలకు ఒక నిబంధననా? ఉపకార వేతనాలు పొందాలంటే ఎస్సీలకు రెండు లక్షల ఆదాయం, ఎస్టీలకు రెండు లక్షల ఆదాయం, బీసీలకు 3 లక్షల ఆదాయం ఉండేట్లు మాత్రమే ఆదాయం సర్టిఫికెట్స్‌ ఉండాలంటారు. అప్పుడే ఆయా సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయంటారు. అగ్రవర్ణ కులాలకు మాత్రం ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్స్‌ కోసం ఎనిమిది లక్షల ఆదాయం వరకు అనుమతించారు. ఇది ఏ న్యాయ సూత్రాల ప్రకారం సమంజసం.ఇది ఆర్టికల్‌ 14 కు విరుద్ధం కాదా?

దొంగ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ అమలు చేసినప్పటి నుంచి నేటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో వారందరి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను వెరిఫై చేయాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ టికెట్లు జారీ చేశారా లేదా అని నిగ్గు తేల్చాలి. అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన వారిని ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై కూడా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. నేటి వరకు వారు పొందిన జీతభత్యాలను రికవరీ చేయాలి. ఆయా స్థానాల్లో ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి.

నష్టాన్ని ఎలా నివారించాలి?
బీసీ బిడ్డలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి.1.ఈడబ్ల్యూఎస్‌  రిజర్వేషన్లు రద్దు చేయాలి, లేదా 1 శాతానికి తగ్గించాలి. లేదా 2.బీసీ రిజర్వేషన్లను పెంచాలి. పై రెండు మార్గాల్లో ఒకదానికంటే రెండవది ఉత్తమం. దాని ద్వారా ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు ఉంటాయి, బీసీ రిజర్వేషన్లను పెంచడం ద్వారా రిజర్వేషన్ల ద్వారా  అన్ని వర్గాల వారికి న్యాయం చేసినట్లు అవుతుంది. అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలును నిలిపి చేయాలి. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు లేని పాత విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలి.

-జుర్రు నారాయణయాదవ్‌
 విద్యావంతుల వేదిక
9494019270

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page