హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో పేదవారిని ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. అవకాశాలు వస్తే పేదలకు మంచి చేయాలని.. అంతేగానీ పేదలను కన్నీరు పెట్టించడం సరికాదన్నారు. మాజీ సీఎం కెసిఆర్ తెలంగాణలో తాగునీరు, , సాగునీరు, కరెంటు సమస్యలను లేకుండా చేశారని, హైదరాబాద్ను దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేశారన్నారు. బతుకమ్మ, దసరా పండుగను వివిధ దేశాలు జరుపుకుంటున్నాయన్నారు. పూలను పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మని, ప్రకృతికి మనం అంత గౌరవం ఇస్తామన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రజలందరూ కలిసి పండుగలు జరుపుకోవడమే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.