కేటీఆర్ ది బుక్ నాలెడ్జి .. రేవంత్ ది ప్రాక్టికల్ నాలెడ్జి
9 లక్షల చెట్లు పోతాయని తెలిసీ జీవో ఎందుకిచ్చారు?
కేటీఆర్ కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్గా మారిందని, కేటీఆర్ సిఎం రేవంత్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన మాటలు తనకు బాధ కలిగించాయని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అన్నారు. మా సిఎంని తిడితే ఉరుకుంటామా..? కేటీఆర్ నువ్వు ఒకటంటే అంటే మేము వంద అంటాం. కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సిఎం రేవంత్రెడ్డిని అనవసరంగా గెలకడం ఎందుకని ప్రశ్నించారు. సిఎం తిరిగి తిరిగితే కేసులు పెట్టడం ఎందుకని కేటీఆర్ను అడిగారు.
కేటీఆర్ నాలుకకు నరం లేదనీ, బుర్రకు తెలివి లేదని అన్నారు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. నాజూకుగా పెరిగిన కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకుని రేవంత్రెడ్డి సిఎం కాలేదన్నారు. రేవంత్రెడ్డికి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వొచ్చానని తెలిపారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో అని ఆయన సూచించారు. రేవంత్రెడ్డికి చెప్తా.. అర గంట, గంట టైం ఇవ్వమని.. అలాగే, దామగుండాన్ని నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థలో 1000 కిలోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.
ఇవన్నీ కేటీఆర్కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదన్నారు. దామగుండంకి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్కు ఎందుకు గుర్తు లేదు అని ప్రశ్నించారు. 9 లక్షల చెట్లు పోతాయని తెలిసి ఎందుకు జీవో ఇచ్చావ్.. ఆ జీవోలో ఏముందో నీకు తెలుసా? కేటీఆర్ అని నిలదీశారు. ఎన్ని చెట్లు తీస్తే.. అదే సంఖ్యలో చెట్లు పక్కన నాటాలని ఉంది.. మూసీ నది అక్కడే పుట్టింది అంటున్నావు.. మరి జీవో ఇచ్చినప్పుడు గుర్తు లేదా మూసీ గురించి కేటీఆర్..వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్కు దమాక్ లేకనే రాజకీయంగా ఖతం అయ్యాడన్నారు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు.. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం కావడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.