- రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి
- హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు
- నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ..
- గణేశ్ నిమజ్జనాలతో నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్
ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో రూ.40 లక్షలు వొచ్చినట్లు తెలిపారు. తొలిసారిగా ఖైరతాబాద్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ పేర్కొంది. కాగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నందున సోమవారం దర్శనాలు నిలిపివేశారు. దీంతో దర్శనం కోసం వొచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.
మరోవైపు ట్యాంక్బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తంగా 31 క్రేన్లు ఏర్పాటయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీంతో వినాయక నిమజ్జనాలు ఆలస్యమవుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ సరిపడా క్రేన్లు లేకపోవడంతో నిమజ్జనం కోసం దాదాపు 5 కిలోటర్ల మేర గణేష్ వాహనాలు బారులు తీరాయి. అర్ధరాత్రి నుంచి నిమజ్జనాల కోసం గణనాథులు వెయిటింగ్లో ఉన్నాయి. ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాలను పోలీసులు మూసివేశారు. ట్యాంక్ బండ్కు వొచ్చే వాహనాలను దారి మళ్లించారు.