- ఇళ్ల మంజూరులో సాయం అందించండి..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ జాయింట్ సెక్రటరీతో భేటీ
పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంత వరకు సహాయం అందించాలని రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ కులదీప్ నారాయణ్ శుక్రవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పది సంవత్సరాలలో పేదల ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతో మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయని కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అవసరం మేరకు రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్ పాల్గొన్నారు